ధ్యానములు మరియు క్రతువులు
“ధ్యానము చేయునది కాదు, జరుగునది.”
ఎలా ప్రారంభించాలి?
ధ్యానములు
అంతరంగములో పెరుగుటకు ధ్యానమే ఆధారము. ఆత్మ యొక్క నిశ్శబ్దమైన వృద్ధి మౌనము నందు జరుగును. అనేక రకములైన ధ్యానములు కలవు.
ఈ విభాగము నందు జగద్గురు పీఠము సభ్యులచే ఉదయము, సాయంకాలము సలుపబడుచున్న ప్రార్థనలు ఇవ్వబడినవి. అలాగే జ్యోతిషపరముగా క్రమముగా చేయవలసిన ధ్యానముల వివరములు ఇవ్వబడినవి.
ప్రార్థనలు మరియు అంశంసనములు
ఈశ్వరుని ఆరాధించుటకు ప్రార్థన సూటియైన మార్గము. సాధకుని మనస్సుకు ఈశ్వర సాన్నిధ్యము కలిగించుటకు ప్రార్థనలు ఉపయోగపడును. ప్రార్థన వలన సాధకుని ప్రాణశరీరము నందు శక్తి ఊర్థ్వ లోకము నుండి భౌతిక లోకమునకు ప్రసరించుటకు మార్గము ఏర్పడును.
ప్రార్థనలు మరియు అంశంసనములు చేయుట వలన మానసిక మార్పులు కలుగుటకు అవకాశము కలదు. అది అనేక గూఢమైన అనుభూతులకు దారితీయును. చివరకు అది దైవ సన్నిధికి చేర్చును.
ధ్యానము యొక్క అవగాహన
ధ్యానము చేయుట కాదు; ధ్యానము జరుగును. ఉన్నతమైన వెలుగు(ప్రచోదనము)ను, స్పందనను చేరుకొనుటకు ధ్యానమునందు ఉండవలెను. భావముల యొక్క మూలమును చేరుట, “నేను ఎవరు?” అని శోధించుట , అనునది ప్రాథమిక ధ్యానము.
సద్గురువుద్వారా లభించు ఈశ్వర సాన్నిధ్యము జిజ్ఞాసువులో కావలసిన మార్పులను కలిగించును. తన చుట్టు చేరిన జీవులకు వారి నిజ స్వరూపమును గుర్తుచేసి, వారు అమరులని, వెలుగు స్వరూపులని ఎవరికి వారు అనుభవముద్వారా తెలుసుకొనునట్లు వారికి మార్గదర్శకత్వము వహించుటయే వారి లక్ష్యము.
పండుగలు
ఉత్తరాయణ సంక్రమణము, దక్షిణాయన సంక్రమణము, మరియు రెండు విషువత్ దినములు సంవత్సర చక్రములోని నాలుగు అతి ముఖ్యమైన పండుగలు. ప్రకృతికి అనుగుణముగా ఉన్న ఈ పండుగలను సద్గురువు శిష్యులైన మనము ఆచరించాలని పరమగురు పరంపర ఆశిస్తున్నది.
క్రతువులు
ఊర్ధ్వలోకములలో జరుగుతున్న సృష్టి క్రమమును భౌతికముగా అనుకరించుటయే క్రతువు. ఇది మనిషి యొక్క ప్రకృతి స్వభావము నందు కావలసిన మార్పుల నిచ్చును. క్రతువు ఆచరించువారు క్రమబద్ధముగా జీవించుట ఆవశ్యకము. పరిశుద్ధమైన క్రతువు వలన స్వభావము తొలగి, చైతన్యము నందు పుట్టుట జరుగును. క్రమబద్ధత క్రతువునకు, క్రతువు వలన సృష్టిలోని రహస్యములు అవగాహన అయి తద్వారా సాధకుడు సత్యము యొక్క వెలుగులోనికి ప్రవేశించును. క్రమబద్ధమైన జీవితము, క్రతువులు చివరకు శరీరము నందలి పదార్థమును సహజ పద్ధతిలో పరిణామము కలిగించి త్వరితగతిన వృద్ధి చెందుటకు ఉపయోగపడును.
సాధకులు తమ సంకల్పమును సంపూర్ణము చేసి సంఘహిత కార్యములను సరియైన పద్ధతిలో నిర్వహించుటకు క్రతువులను ఉపయోగించెదరు.
ఋక్కులు మరియు సూక్తములు
సూక్తములు అనగా “సు-ఉక్తములు”, అనగా బాగుగా ఉచ్చరింపబడినవి. వేద సూక్తములన్నియు చక్కగా ఉచ్చరింపబడినవి. ప్రకృతిని గమనించి వేద ఋషులచే ఉచ్చరింపబడినవి. “సృష్టి ఎట్లు నిలచి ఉన్నది మరియు ఎట్లు నిర్మాణమగుచున్నది” అన్న విషయము వేద ఋషులకు తెలుసును. “సృష్టి అవ్యక్తముగా ఉండుట” అను స్థితి నుండి సృష్టిగా మారుట అనునది శబ్దము మరియు వెలుగుల యొక్క ప్రక్రియయే. సృష్టికి ముందు ఉచ్చరింపబడిన శబ్దము విశ్వముగా ఎట్లు పరిణమించినదో ఋషులు గ్రహించిరి. నిశ్శబ్దములోని శబ్దమును అనుభవము చెందటము అనునది ఒకరకమైన ప్రక్రియ. ఆ రకరకములైన ప్రక్రియలే సూక్తములుగా చెప్పబడినవి.